దేశీయ విమాన టికెట్ల ధరలపై ఇప్పటివరకు అమలులో ఉన్న తాత్కాలిక పరిమితిని (క్యాప్) కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో డిమాండ్కు అనుగుణంగా టికెట్ల ధరలను స్వేచ్ఛగా నిర్ణయించుకునే వెసులుబాటు విమానయాన సంస్థలకు కలగనుంది.
గతేడాది డిసెంబర్ లో ముఖ్యంగా ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాల వల్ల టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులను ఆకస్మిక ధరల భారం నుంచి కాపాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ టికెట్లపై గరిష్ఠ ధరల పరిమితిని విధించింది. అప్పట్లో దూరాన్ని బట్టి ఎకానమీ క్లాస్ వన్-వే టికెట్ ధర సుమారు రూ. 18,000 మించకుండా నియంత్రణలు విధించారు.
అయితే, ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి. ధరలపై పరిమితి వల్ల నష్టాలు వస్తున్నాయని, దాన్ని తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ వంటి పరిశ్రమల సంఘాలు కోరాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
ధరలపై పరిమితిని ఎత్తివేసినప్పటికీ, పండగలు, అత్యవసర సమయాల్లో విమానయాన సంస్థలు అన్యాయంగా ధరలు పెంచితే తీవ్రంగా పరిగణిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మళ్లీ ధరల నియంత్రణను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది.