జనసేన పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణకు మధ్య ఉన్న బంధం అధికారికంగా ముగిసింది. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ బొలిశెట్టి చేసిన అభ్యర్థనను పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదించారు. ఈ మేరకు జనసేన పార్టీ నిన్న ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇకపై బొలిశెట్టి సత్యనారాయణతో పార్టీకి ఎలాంటి సంబంధం ఉండబోదని, ఆయన చేపట్టే కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఇక పార్టీ నిర్ణయంపై బొలిశెట్టి సత్యనారాయణ కూడా స్పందించారు. పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల కోసం మరింత విస్తృతంగా పనిచేయాలన్న తన ఆకాంక్షను గౌరవించి, బాధ్యతల నుంచి విముక్తి కల్పించినందుకు పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నుంచి అధికారికంగా వైదొలిగినప్పటికీ, జనసేన సిద్ధాంతాలతో తన అనుబంధం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపైనే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని బొలిశెట్టి స్పష్టం చేశారు. కొల్లేరు సరస్సు పరిరక్షణతో పాటు రాష్ట్రంలోని చిత్తడి నేలలను కాపాడటం, భూ వినియోగ మార్పిడిని నియంత్రించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు బొలిశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.