దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులోని హోసూరులో ఓ హోటల్ వినూత్నమైన ఆఫర్తో ముందుకొచ్చింది. ఒక వాణిజ్య సిలిండర్ ఇస్తే, నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా బిర్యానీ అందిస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
హోసూరులోని తళి రోడ్డులో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలెండర్ కోసం ఈ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టారు. ఎవరైనా తమకు వాణిజ్య సిలెండర్ ఇచ్చి తమ హోటల్ లో నెల రోజుల పాటు ఉచితంగా చికెన్ లేదా మటన్ బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. ఫుల్ సిలెండర్ తీసుకుని అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలెండర్ ను వెంటనే ఇస్తామని బోర్డు పెట్టారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చిందని రెస్టారెంట్ మేనేజర్ అశోక్ తెలిపారు. గత పదిహేను రోజుల్లో ఆరుగురు సిలిండర్లు తీసుకొచ్చి ఇచ్చారని, అయితే వారిలో ఎవరూ నాలుగు రోజులకు మించి హోటల్ లో బిర్యానీ తినలేదని పేర్కొన్నాడు. గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్ మూసెయ్యాలని నిర్ణయించుకున్న సమయంలో తమ పాత కస్టమర్ ఒకరు ఈ సలహా ఇచ్చారని అశోక్ తెలిపారు.