గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఊరట కల్పించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఉమ్మడి గుర్తు కేటాయింపు నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, గత రెండు సాధారణ ఎన్నికల్లో ఏ ఒక్కదానిలోనైనా కనీసం 1శాతం ఓట్లు సాధిస్తే, ఆ పార్టీ ఉమ్మడి గుర్తు పొందేందుకు అర్హత సాధిస్తుంది.
ఈ మేరకు ‘ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్లు, కేటాయింపు) ఉత్తర్వులు, 1968’లోని పేరాగ్రాఫ్ 10(బి)కి సవరణలు చేస్తూ మార్చి 28న ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో పోటీ చేసి 1శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకు కూడా తాజా ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు కేటాయించేందుకు ఈ సవరణ అవకాశం కల్పిస్తుంది. ఇంతకుముందు నిబంధనల ప్రకారం, పార్టీ పోటీ చేసిన చిట్టచివరి ఎన్నికలో కనీసం 1శాతం ఓట్లు సాధిస్తేనే ఉమ్మడి గుర్తు పొందేందుకు అర్హత ఉండేది.
క్షేత్రస్థాయిలో ఉనికి ఉండి, ఓటర్ల మద్దతు కూడగడుతున్న చిన్న పార్టీలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఒక ఎన్నికలో మంచి ఫలితాలు సాధించి, ఆ తర్వాతి ఎన్నికలో 1శాతం ఓట్ల షేర్ను అందుకోలేకపోయిన పార్టీలకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కొత్తగా సవరించిన ఈ నిబంధనలు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. రాబోయే అన్ని ఎన్నికలకు ఈ మార్పులు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.