Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..?పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..?పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!
-ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరల పెంపు
-ధరలు పెంచడానికి సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
-బోనకల్లు మండలంలోకి ప్రవేశించిన పాదయాత్ర
-పాదయాత్రకు సిపిఐ,సిపిఎం నాయకులు సంఘీభావం

సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ గ్యాస్, టోల్ చార్జీలు ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డివిరిస్తుంటే సీఎం కేసీఆర్ కరెంటు చార్జీలు పెంచి ప్రజల ను బాదుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామం నుంచి బోనకల్ మండలం ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, చిరునోముల గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సామాన్య పేద ప్రజలపై భారం మోపుతున్న పాలకులు దేశ సంపదను
కార్పొరేట్ శక్తులకు పంచిపెడుతున్నారని విమర్శించారు. పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టులు, మిశ్రమ ఆర్థిక విధానాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఫలాల ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ దారాదత్తం చేస్తున్నదని ధ్వజ మెత్తారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందని వివరించారు. ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. నెలకు రూ.5వేలు రావాల్సిన కరెంట్ బిల్లు రూ. 96 వేలు బిల్లు వేస్తే కట్టడం సాధ్యమేనా? ప్రజలపై ఇలా కరెంటు చార్జీల భారం మోపితే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సంపద ఉన్న రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారం మోపడం కరెక్ట్ కాదని అన్నారు.

పాదయాత్రకు సిపిఐ, సిపిఎం సంఘీభావం

ప్రజాసమస్యల పరిష్కారం కొరకై *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర చింతకాని మండలం నాగులవంచ గ్రామం నుంచి బోనకల్లు మండలం ముస్టికుంట్ల గ్రామానికి చేరుకున్న సందర్భంగా బోనకల్లు మండలం కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చి భట్టి విక్రమార్క గారికి ఘన స్వాగతం పలికారు. సీఎల్పీ నేతలు కలిసేందుకు రోడ్లపైకి వచ్చిన జనాలతో ముస్టికుంట్ల గ్రామాం జన జాతరను తలపించింది. భట్టి పాదయాత్రకు సిపిఐ, సిపిఎం మండల నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పు కళాకారుల బృందం విన్యాసాలు, కోలాటం మహిళల నృత్యాలతో హోరేత్తింది. సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చి భట్టి అడుగులో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కారు.

Related posts

కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడలో ఉద్రిక్తత…

Drukpadam

ఒక్క పబ్ పైనే దాడులు చేయడం అనుమానాలు కలిగిస్తోంది: విజయశాంతి

Drukpadam

పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!..

Drukpadam

Leave a Comment