కుప్పంలో తమిళ నటుడు పోటీ అంటూ వస్తున్న వార్తలపై పెద్దిరెడ్డి క్లారిటీ
- 2024లో కుప్పం అభ్యర్థి భరతేనని పెద్దిరెడ్డి ప్రకటన
- తమిళ నటుడంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని ఆరోపణ
- తాము గెలిపించిన నేత వేరే పార్టీలోకి వెళ్లి మంత్రి అయ్యాడని సెటైర్లు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 2024లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టత నిచ్చారు. 2024లో కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు గురువారం చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో భాగంగా పెద్దిరెడ్డి ఈ ప్రకటన చేశారు.
కుప్పంలో చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ యాక్టర్ను బరిలోకి దింపుతోందంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేది భరత్ మాత్రమేనని ఆయన తెలిపారు. గతంలో పలమనేరులో తాము గెలిపించిన నేత వేరే పార్టీలోకి వెళ్లి మంత్రి అయ్యారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. దానికి ప్రతిగా పలమనేరు ప్రజలు ఆ మాజీ మంత్రికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మాజీ మంత్రిని ఓడించిన వెంకటే గౌడనే 2024లోనూ పలమనేరు బరిలో నిలుపుతామని, ఆ ఎన్నికల్లోనూ ఆయనను మరింత మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
![peddireddy clarifies on kuppam ysrcp candidate for 2024 elections](https://i0.wp.com/img.ap7am.com/cdn-cgi/image/width=320,quality=85,f=auto/bimg/cr-20220630tn62bd84d8b5132.jpg?resize=320%2C213&ssl=1)