Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రారంభోత్సవం రోజున 10 స్టేషన్లలో ఆగనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు

ప్రారంభోత్సవం రోజున 10 స్టేషన్లలో ఆగనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు

  • ఈ నెల 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం
  • సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ
  • వివరాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • సికింద్రాబాద్ నుంచి 8.30 గంటల్లోనే తిరుపతి చేరుకుంటుందని వెల్లడి

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 8న ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందేభారత్ రైలు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య ఒక వందేభారత్ రైలు పరుగులు తీస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి మధ్యన కూడా వందేభారత్ రైలును ప్రవేశపెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు స్టేషన్లలోనే ఆగుతుంది. సికింద్రాబాద్ లో బయల్దేరాక నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలోనే ఆగుతుందని తెలిపారు. అయితే, ప్రారంభోత్సవం రోజున 10 స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో వందేభారత్ ఆగుతుందని, ఆ రోజున ప్రజలు పెద్ద ఎత్తున ఆయా రైల్వే స్టేషన్లకు వచ్చి వందేభారత్ కు ఘనస్వాగతం పలకాలని కిషన్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కేవలం 8.30 గంటల్లోనే తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు.

Related posts

గోదావరి ఉగ్రరూపం …మూడవ ప్రమాద హెచ్చరిక జారీ :భద్రాచలం లోనే మంత్రి పువ్వాడ మకాం

Drukpadam

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంపన్న దేశం అమెరికా కాదు… చైనా!

Drukpadam

ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

Drukpadam

Leave a Comment