Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కెన్యాలో దారుణం.. మతపెద్ద సూచనతో కఠిన ఉపవాసం చేసి 47 మంది మృతి!

కెన్యాలో దారుణం.. మతపెద్ద సూచనతో కఠిన ఉపవాసం చేసి 47 మంది మృతి!

  • ఒకే కుటుంబంలో ఐదుగురి బలవన్మరణం
  • కిల్ఫీ ప్రావిన్స్ లో తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
  • మతపెద్దను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అడవిలో దాక్కుని ఉపవాసం చేస్తున్న వారిని పట్టుకుని ఆసుపత్రికి తరలించిన అధికారులు

కెన్యాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మతపెద్ద బోధనలతో ప్రభావితం అయిన భక్తులు కఠిన ఉపవాసం చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. మూఢభక్తితో ఈ దారుణానికి పాల్పడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలంలో తవ్వే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయని పోలీసులు తెలిపారు.

కిల్ఫీ ప్రావిన్స్ లోని షాకహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ బోధకుడు మాకెంజీ ఎన్ థాంగే ఈ దారుణానికి కారణమని పోలీసులు చెప్పారు. ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢభక్తి వైపు ప్రోత్సహించాడని ఆరోపిస్తున్నారు. జీసస్ ను కలుసుకోవాలని అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మాకెంజీ పిలుపునిచ్చాడని తెలిపారు. ఇలా చనిపోయిన వారిని పాతిపెడితే వారు పరలోకానికి వెళతారని, అక్కడ జీసస్ ను కలుసుకుంటారని చెప్పాడన్నారు.

ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసుకున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. ఉపవాసంతో మరణించిన వారిని అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు బయటపడింది. దీంతో పోలీసులు మాకెంజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. షాకహోలా ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల 11న 11 మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం మరో 26 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ బోధనల మేరకు కఠిన ఉపవాసం చేస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రావడంతో వీరంతా అటవీ ప్రాంతంలో దాక్కుని మరీ ఉపవాసం కొనసాగించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మృతదేహాల కోసం తవ్వకాలు జరుపుతూనే ఆ ప్రాంతంలో ఇంకా ఉపవాసం చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

2019లోనే చర్చిని మూసేశా..: ఫాస్టర్ మాకెంజీ
సంచలనం సృష్టించిన ఈ మరణాలపై ఫాస్టర్ మాకెంజీ స్పందిస్తూ.. తాను ఎవరినీ ఆత్మహత్యకు ప్రోత్సహించలేదని చెప్పాడు. 2019లోనే చర్చిని మూసేశానని వివరించాడు. ఈ మరణాలతో తనకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. ఈ క్రమంలో 47 మంది ఆహారం తీసుకోకపోవడం వల్లే చనిపోయారని నిరూపించేందుకు అధికారులు మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమయ్యాడనే కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే, జరిమానా చెల్లించి ఈ కేసు నుంచి మాకెంజీ బయటపడ్డాడని వివరించారు.

Related posts

కేంద్రంతో ,జగన్ కు చెడిన స్నేహం … వైసీపీ ,బీజేపీ లమధ్య మాటల యుద్ధం…

Drukpadam

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

Ram Narayana

టీఆర్ యస్ ను పల్లెత్తు మాట అనని అమిత్ షా ..నిర్మల్ సభలో చప్పగా సాగిన ప్రసంగం!

Drukpadam

Leave a Comment