Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కురుక్షేత్రాన్ని తలపిస్తున్న ఈటల వర్సెస్ గంగుల మాటల యుద్ధం

ఈటల వర్సెస్ గంగుల మాటల యుద్ధం

  • బిడ్డా నేను …..నేను సంస్కారాన్ని వదిలేస్తే మాడి మషిఅయిపోతావ్
    -నీ ….భాగోతం మొత్తం నాకు తెలుసు
    -మాటలు జాగ్రత్తగా రానివ్వు ….వళ్లు దగ్గర పెట్టుకో
    -2023 నీ పని ఖతం … తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే
    -అధికారం ఎవరికీ శాస్వతం కాదని గుర్తుపెట్టుకో
    -నీవు ఎన్ని టాక్స్ లు ఎగొట్టావో తెలియదు అనుకున్నావా ?
    -కరీంనగర్ ను బొందలగడ్డ చేస్తున్నావ్…
    -హుజురాబాద్ లో బెదిరింపులకు పాల్పడుతున్నావ్
    -హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు కొనలేరు
    -ఇక్కడ ప్రజలపై ఈగ వాలకుండా చూస్తా …

మాజీ మంత్రి ఈటల ,మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం పౌరాణిక సినిమాను తలపిస్తుంది. కురుక్షేత్రంలో సీన్లు గుర్తొస్తున్నాయి . ఒకరిపై ఒకరు విసురుకుంటున్న సవాళ్లు ,ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. అసలే ఇద్దరిమధ్య సంఖ్యత అంతంత మాత్రమే ……. ఇంకేముంది కేసీఆర్ చాణుక్యం , కేటీఆర్ డైరక్షన్ లో గంగుల రెచ్చిపోతున్నారు. వ్యూహాత్మకంగా ఈటలను దెబ్బగొట్టే పనిని జిల్లా మంత్రి గంగులకు అప్పగించారు. ఆయనకు అప్పగించిన భాద్యతను గంగుల భుజానికెత్తుకొని హుజారాబాద్ ఆపరేషన్ మొదలు పెట్టారు. దీనితో అనివార్యంగా ఈటల గంగుల మధ్య వార్ గా మారింది. మంగళవారం ఈటల హుజురాబాద్ లోను , గంగుల కరీంనగర్ లో మీడియా తో ఒకరిపై ఒకరు విమర్శలు , సవాళ్లు , ప్రతి సవాళ్లు తో హీటెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈరోజ మీడియాతో మాట్లాడుతూ గంగులకు ఈటల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘బిడ్డా గంగులా… అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో’ అని వ్యాఖ్యానించారు.

కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని… నీలాంటి చరిత్ర తనది కాదని అన్నారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని అన్నారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.

నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని… సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని… 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2006 ఎన్నికల్లో దివంగత రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎందరో నేతలను కొన్నా… తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నే గెలిపించారని అన్నారు. ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో అదే జరుగుతుందని చెప్పారు.

తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని… లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే… 54 వేల ఓట్ల మెజారిటీతో హుజూరాబాద్ ఆదుకుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని అన్నారు. తన ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పారు.

ఈటలకు గంగుల వార్నింగ్

బిడ్డా..బిడ్డా అనిబెదిరిస్తే బెదిరేటోడు ఎవ్వడు లేడని కామెంట్
ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చెయ్యాలని డిమాండ్
అన్నీ పరిశీలించాకే సీఎం బర్తరఫ్ చేశారన్న మంత్రి
అసైన్డ్ భూములు కొన్నట్టు ఈటలే ఒప్పుకున్నారని వెల్లడి
అవన్నీ ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని సవాల్

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బిడ్డా.. అని ఈటల అంటున్నారని, తానూ ఓ బీసీ బిడ్డనేనని అన్నారు. ‘‘ఏం బెదిరిస్తున్నవా ఈటల రాజేందర్? నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరేటోడు ఎవ్వడు లేడు.. బిడ్డా..బిడ్డా అని బెదిరిస్తే అంతకన్నా ఎక్కువ మాట్లాడుతా. నేనూ బీసీ బిడ్డనే. నీ కన్నా నాకు ఆత్మగౌరవం ఎక్కువ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టే ఈటలకు ఇన్నాళ్లూ ఆ గౌరవమైనా దక్కిందన్నారు.

నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు కొన్నట్టు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే సీఎం కేసీఆర్.. ఈటలను బర్తరఫ్ చేశారని చెప్పారు.

అసైన్డ్ భూములు, దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంలో ఈటల తప్పు చేశారని అధికారులు తేల్చారని గంగుల చెప్పారు. అసైన్డ్ భూములను కొన్నట్టు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వాధికారులు తేటతెల్లం చేశారన్నారు. నిజంగా ఆత్మగౌరవం ఉండి ఉంటే ఆ భూములన్నింటినీ ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని సవాల్ విసిరారు.

1992 నుంచి చట్టబద్ధంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని గంగుల చెప్పారు. ఈటలలాగా అసైన్డ్ భూములు కొని గోడౌన్లు కట్టి మద్యం షాపులకు ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికీ క్వారీలు నడుస్తున్నాయని, దానిపై సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని మండిపడ్డారు.

గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కయ్యారా? అని గంగుల ప్రశ్నించారు. తాను పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే దానికి ఐదింతలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అధికారుల కమిటీ వేసి విచారణ చేయించేందుకు తాను సిద్ధమని, విచారణలో తప్పు చేశానని తేలితే దేనికైనా సిద్ధమని అన్నారు.

తాను ఓడిపోతానని ఈటల రాజేందర్ ప్రచారం చేశాడని, కానీ, తాను గెలిచేటప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈటల తనతో మాట్లాడనే లేదని అన్నారు. వ్యక్తిగతంగా పోతే తానూ వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుందని, దానిని తట్టుకోలేవని, అది చాలా భయంకరంగా ఉంటుందని ఈటలను హెచ్చరించారు.

Related posts

కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే.. అరెస్టులా?: ప్రభుత్వంపై ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్

Drukpadam

తాను బీకాం చదవలేదని అశోక్ బాబు స్వయంగా చెప్పారు: విజయసాయిరెడ్డి

Drukpadam

షర్మిల మంగళవారం దీక్షలు … మూస పద్దతిలో విమర్శలు…

Drukpadam

Leave a Comment