మిస్టర్ జగన్… నీ పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది: పవన్ కల్యాణ్…
- అమ్మఒడి సభలో పవన్ పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్
- భీమవరం సభలో సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్
- పనికిమాలిన మాటలు మాట్లాడితే ఊరుకోబోనని స్పష్టీకరణ
- జగన్ జీవితంలో ప్రతి క్షణం తనకు తెలుసన్న జనసేనాని
అమ్మఒడి సభలో తన వైవాహిక జీవితంపై సీఎం జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు.
మిస్టర్ జగన్… చెవులు విప్పుకుని విను… నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు… నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిక్షణం నాకు తెలుసు… మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు… చెబుతాను! నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త! అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
“జగన్… నీకే చెబుతున్నా. నువ్వు ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ఇది గట్టి వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాం… సిద్ధంగా ఉండు” అని పవన్ స్పష్టం చేశారు.
గతంతో పోల్చితే తమ వాళ్లు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గిందని, వైసీపీ నేతల నోట్లో సైలెన్సర్లు తగ్గిస్తే తమ వాళ్లు పూర్తిగా తగ్గిస్తారని పవన్ వ్యాఖ్యానించారు.
తరాలు లేచిపోతాయి జాగ్రత్త… వైవీ సుబ్బారెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలిదశ నేటితో ముగిసింది. ఈ సాయంత్రం భీమవరంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. వైసీపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
పర్సనల్ విషయాల జోలికి వస్తే వదిలిపెట్టనంటూ సీఎం జగన్ ను హెచ్చరించిన జనసేనాని… శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ‘దేవుడి సొమ్ము తిన్నవారు ఎవరైనా నాశనం అయిపోతారు… తరాలు లేచిపోతాయి జాగ్రత్త వైవీ సుబ్బారెడ్డి గారూ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగింది నిజం కాదా? ఆలయ నిర్మాణాల కోసం కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు?” అంటూ ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడా, లేడా…? జనసేన అధికారంలోకి రాగానే తప్పు చేసిన ప్రతి వైసీపీ నాయకుడిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.