- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- వందల సంఖ్యలో క్షతగాత్రులు
- అర్ధరాత్రి వరకు 10 మృతదేహాల వెలికితీత
- రాయగడ రైలులోని లోకోపైలట్లు ఇద్దరూ మృతి
విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్న విశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి.
రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది.
రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరినాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎస్ఆర్ పురానికి చెందిన గిడిజాల లక్ష్మి (40)గా గుర్తించారు. అలాగే, పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
నేడు పలు రైళ్ల రద్దు…
విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
విజయనగరం రైలు ప్రమాదం.. హెల్ప్లైన్ నంబర్లు ఇవే!
- హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన రైల్వే
- ఘటనా స్థలం వద్ద కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే, విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
హెల్ప్లైన్ నంబర్లు ఇలా..
విజయనగరం కలెక్టరేట్: 94935 89157
విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్ 89125 58494, 83414 83151
83414 83151 (ఈ నంబరులో నిత్యం వైద్యుడు అందుబాటులో ఉంటాడు)
అత్యవసర వైద్య సదుపాయం కోసం 8688321986 నంబరును సంప్రదించవచ్చు
భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729
వాల్తేరు టెస్ట్ రూం 89780 80805
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ 89780 80815
వాల్తేరు డివిజన్ 08942286245, 08942286213
అలమండ, కంటకాపల్లి : 89780 81960
విజయనగరం: 08922221206, 08922221202, 8978080006
శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
ఏలూరు: 08812232267
సామర్లకోట: 08842327010
రాజమహేంద్రవరం: 08832420541
తుని: 08854252172
విశాఖపట్టణం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్లు: 08912 746330, 08912 744619, 8106053051, 81060 53052, 85000 41670, 85000 41671