Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మీరు కేంద్రానికి మద్దతు ఇచ్చారు ..మీది చీకటి ఒప్పందం…రేవంత్ ,కేటీఆర్ మధ్య డైలాగ్ వార్!

  • మోదీ తెచ్చిన ప్రతి బిల్లుకూ మద్దతు పలికారన్న రేవంత్ రెడ్డి
  • దళిత రాష్ట్రపతి, తెలుగు ఉపరాష్ట్రపతికి మద్దతిచ్చామని కేటీఆర్ కౌంటర్
  • రేవంత్ రెడ్డి పరాన్నజీవి అని చురక

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు పలికారని సీఎం విమర్శిస్తే… అవసరమైన వాటికి కచ్చితంగా మద్దతిచ్చామని… కానీ రైతు చట్టాల వంటి వాటికి మాత్రం దూరం జరిగామని కేటీఆర్ తెలిపారు.  

అదానీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందని కేటీఆర్ ఆరోపించారు. అదానీ, అంబానీలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు. అసలు కేసీఆరే కేంద్రం తెచ్చిన ఎన్నో చట్టాలకు మద్దతు తెలిపారని ఆరోపించారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు… ఇలా ఎన్నింటికో మద్దతు తెలిపారన్నారు. నోట్ల రద్దు గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడవద్దని సూచించారు. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. మీరు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం అన్నారు. ప్రజలు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్‌లో అహం తగ్గలేదన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదని సూచించారు. తాము కేంద్రానికి భయపడుతున్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారని… కానీ ఇదివరకు మోదీకి కేసీఆరే ఊడిగం చేశారన్నారు.

జీఎస్టీ తెచ్చినప్పుడు బీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు పలికిందన్నారు. పైగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపారని విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లి ఆర్టీఐ సవరణకు ఓటు వేశారన్నారు. 

యస్… కచ్చితంగా అందుకే ఓటేశాం: కేటీఆర్

కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు తాము మద్దతు పలికినట్లుగా సీఎం చెబుతున్నారని కానీ అందులో వాస్తవం లేదన్నారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అవుతుంటే, తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతుంటే తాము కచ్చితంగా మద్దతు పలికామన్నారు. అవును… కేంద్రానికి ఈ విషయాల్లో కచ్చితంగా మద్దతిచ్చామన్నారు. కానీ రైతు చట్టాలకు తాము మద్దతివ్వలేదని స్పష్టం చేశారు.

అయినా రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. తాము గెలవలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని… తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డిలా తాము పరాన్నజీవులం కాదని… ఉద్యమం సమయంలో పదవులకు రాజీనామా చేశామన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం ఉన్నదే రేవంత్ రెడ్డికి అన్నారు. 

సింగరేణిపై చర్చకు సిద్ధం: భట్టివిక్రమార్క

సింగరేణి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కేటీఆర్ వివిధ అంశాలపై సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హైదరాబాద్ పవర్ సర్కిల్‌ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. ఎవరో పత్రికలో రాసిన దానిని పట్టుకొని సభలో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదన్నారు.

అయ్య పేరు చెప్పుకొని రాలేదన్న రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీని అంటున్నారా? అని కేటీఆర్ చురక…

  • కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
  • మోదీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడ్డారేమోనని ఎద్దేవా
  • పేమెంట్ కోటాలో పదవిని కొట్టేశారని మేమూ అనగలమన్న కేటీఆర్
  • బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చను సమర్థిస్తున్నామని స్పష్టీకరణ
  • బడ్జెట్‌లో 8+8=0 అయిందన్న కేటీఆర్

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు రాలేదని విమర్శించారు. మోదీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కుటుంబం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ తమ నిర్ణయం చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చిందే మీ అభిప్రాయమా? అని చురక అంటించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము అయ్యలు, తాతల పేర్లు చెప్పుకొని పైకి రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగామన్నారు. 

రాహుల్ గాంధీని అంటున్నారా?: కేటీఆర్ చురక

తమకు ఈ చర్చకు సంబంధించి తీర్మానం కాపీ అందలేదని కేటీఆర్ అన్నారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలన్నారు. సీఎంకు ఓపిక, సహనం ఉండాలని సూచించారు. అయ్యలు, తాతలు అంటూ ముఖ్యమంత్రి అంటున్నారని, అనాలనుకుంటే పేమెంట్ కోటాలో పదవి కొట్టేశారని తాము కూడా అనవచ్చునని చురక అంటించారు. అయ్యల పేర్లు, తాతల పేర్లు చెప్పుకొని వచ్చారని ముఖ్యమంత్రి అంటున్నారని… ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా? అని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశించి.. మీరు మాకు మాత్రమే చెబుతున్నారని… కానీ అధికార పార్టీని వారించడం లేదని అన్నారు.

చర్చను సమర్థిస్తున్నాం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న చర్చను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే పదం కూడా రాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని… అందుకు అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమేనని కేటీఆర్ అన్నారు.

8+8=0 అంటూ వ్యంగ్యం! 

సాధారణంగా 8+8=16 అవుతుందని, కానీ ఇక్కడ మనకు జరిగింది మాత్రం గుండు సున్నా అని చురక అంటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లలో గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ పైవిధంగా మాట్లాడారు. నిన్నటి బడ్జెట్ చూశాక తెలంగాణలోని ప్రతి బిడ్డకు మనకు జరిగిన అన్యాయం తెలిసిందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా లేనందువల్లే మనకు నిధులు రాలేదని గతంలో ముఖ్యమంత్రి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఢిల్లీ తత్వం ఇన్నాళ్లకు బోధపడిందన్నారు. తెలంగాణ హక్కులు ఎవరు కాలరాసినా మెడలు వంచుతామన్నారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడామని… మోదీ ప్రభుత్వంపై పోరాడామని… ఇప్పుడూ పోరాడుతామన్నారు. సభా నాయకుడు ఇష్టారీతిన విమర్శలు చేయడం సరికాదన్నారు.

Related posts

అసెంబ్లీలో అక్బరుద్దీన్ వెర్సస్ రేవంత్ రెడ్డి.. మాటకు మాట!

Ram Narayana

ప్రజల సెంటిమెంట్‌ను కేసీఆర్ తన ఆర్థిక దోపిడీకి ఉపయోగించుకున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

Leave a Comment