Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం.. భారతీయ విద్యార్థులపై ప్రభావం…

  • 2025లో విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించిన ఆసీస్
  • ఉన్నత విద్య, వృత్తి విద్యా, ట్రైనింగ్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య పరిమితం
  • ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది. రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ ప్రకటించారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు.

ఈ పరిణామంపై ఆస్ట్రేలియా మైగ్రేషన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ అథారిటీ సభ్యుడు సునీల్ జగ్గీ స్పందించారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని 2022లో ఆస్ట్రేలియా 5.10 లక్షలకు పరిమితం చేసిందని, ఈ సంఖ్యను 2023లో 3.75 లక్షలకు కుదించిందని ప్రస్తావించారు. వార్షిక ప్రణాళికల్లో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తాజాగా మరింత తగ్గించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గింపు అంతర్జాతీయ విద్యార్థులు అందరికీ వర్తిస్తుందని, భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదని అన్నారు.

ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి‌లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులపై ఈ ప్రకటన ప్రభావం చూపుతుందని, పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతారని ఆయన అంచనా వేశారు.

Related posts

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కీలక మార్పులు… కొత్తగా 5 ఆటలకు చోటు

Ram Narayana

 చెక్ రిపబ్లిక్ యూనివర్సిటీలో కాల్పులు.. 15 మంది దుర్మరణం

Ram Narayana

రష్యా టౌన్ ను ఆక్రమించిన ఉక్రెయిన్..!

Ram Narayana

Leave a Comment