Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

న‌గ‌ల వ్యాపారి ఇంటిపై న‌కిలీ ఈడీ అధికారుల దాడి.. భలే ఐడియా వేసిన వ్యాపారి!

  • యూపీలోని మ‌ధుర‌లో ఘ‌ట‌న‌
  • వ్యాపారి అశ్వనీ అగ‌ర్వాల్‌ ఇంటికి న‌లుగురు వ్య‌క్తులు న‌కిలీ సెర్చ్ వారెంట్‌తో వెళ్లి సోదాలు
  • వారి తీరుపై అనుమానంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన న‌గ‌ల వ్యాపారి
  • ఇరుగు పొరుగు వారిని పోగు చేయ‌డంతో పారిపోయిన న‌కిలీ ఈడీ అధికారులు

యూపీలోని మ‌ధుర‌లో ఓ న‌గ‌ల వ్యాపారికి రైడ్ పేరుతో నకిలీ ఈడీ అధికారులు సినిమా చూపించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం న‌కిలీ సెర్చ్‌ వారెంట్‌తో వ‌చ్చారు. అయితే, వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో న‌కిలీ ఈడీ అధికారులు అక్క‌డి నుంచి కారులో పారిపోయారు. 

శుక్ర‌వారం ఉదయం గోవింద్ నగర్‌లోని ఉంటున్న ప్రముఖ వ్యాపారి అశ్వనీ అగ‌ర్వాల్‌ ఇంటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారులమని చెప్పారు. అలాగే మ‌రో వ్యక్తిని పోలీస్ అధికారిగా చెప్పుకున్నారు. ఆయన ఇంటికి రైడ్‌కు వ‌చ్చామ‌ని చెప్పి, త‌మతో పాటు తీసుకువ‌చ్చిన ఫేక్ సెర్చ్ వారెంట్‌ను చూపించారు. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించాల్సిందిగా చెబుతూ, అగ‌ర్వాల్‌ మొబైల్‌ ఫోన్ లాక్కున్నారు.

ఈ క్ర‌మంలో వారి తీరుపై వ్యాపారికి అనుమానం క‌లిగింది. పోలీస్ అధికారి అని చెప్పిన వ్య‌క్తిని మీది ఏ పోలీస్ స్టేష‌న్ అని అడిగారు. దాంతో స‌ద‌రు వ్య‌క్తి గోవింద్‌పూర్ పీఎస్ బ‌దులుగా గోవింద్‌న‌గ‌ర్ అని స‌మాధానం చెప్పాడు. దాంతో అగ‌ర్వాల్ అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. 

వెంట‌నే వ్యాపారి తన ఇంటి నుంచి బయటకు పరుగు తీసి ఇరుగు పొరుగువారిని అప్ర‌మ‌త్తం చేశాడు. దీంతో స్థానికులు ఆయన ఇంటి వద్ద గుమిగూడారు. వారిని కూడా న‌మ్మించేందుకు ప్ర‌య‌త్నించారు నకిలీ ఈడీ అధికారులు, నకిలీ పోలీస్‌ అధికారి. కానీ, గ‌ట్టిగా నిల‌దీయడంతో వారు అక్క‌డి నుంచి కారులో పారిపోయారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంటనే గోవింద్ నగర్‌కు చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి ఇంట్లోని సీసీటీవీ ఫుటేటీని పరిశీలించారు. నకిలీ ఈడీ అధికారులు, నకిలీ పోలీస్‌ అధికారిని గుర్తించి వారిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని మ‌ధుర ఎస్ఎస్‌పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌ను ఆయ‌న మోసపూరితమైన ఆపరేషన్‌గా పేర్కొన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ వీడియో క్లిప్ ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

సంచలనంగా మారిన షర్మిల నిర్ణయం …చైత్ర ఇంటిముందే దీక్ష!

Drukpadam

ప్రధాని నరేంద్రమోదీకి తాను రాసిన పుస్తకం కాపీని అందించిన ప్రణబ్ కూతురు

Ram Narayana

విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూ. 7.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత!

Drukpadam

Leave a Comment