Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సైన్సు అండ్ టెక్నాలజీ

ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం!


అద్భుత ఖగోళ దృశ్యాలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరిచే భారత ఔత్సాహికులకు గుడ్‌న్యూస్. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో కనువిందు చేస్తోంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023 ఏ3 అనే తోకచుక్క (Tsuchinshan-ATLAS) ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో వీక్షించవచ్చునని, మసకబారిన బంతిలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని సూచించారు.

సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది. ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ ఘట్టమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని పేర్కొన్నారు.

భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తోంది. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము సమయం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచించారు. ఇక అక్టోబర్ 12 నుంచి ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనిపిస్తోందని చెప్పారు.

ఈ తోకచుక్కకు సంబంధించి ఖగోళ ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి కొందరు ఈ ఫొటోలు తీశారు. ఈ చిత్రాలలోని తోకచుక్క పొడవాటి తోకతో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఆకాశం స్పష్టంగా ఉన్న లడఖ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి తోకచుక్క స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related posts

భూమిపై కొవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

Ram Narayana

చందమామపై బయటపడ్డ భారీ బిలం.. ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు!

Ram Narayana

ముంచుకొస్తున్న భారీ సౌర తుపాను..

Ram Narayana

Leave a Comment