జాతీయ వార్తలుప్రమాదాలు ...

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారత యాత్రికుల మృతి…

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న భారత యాత్రికుల బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.

గోర్ఖా జిల్లాలోని షాహిద్ లఖన్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని కాంతార్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందని జిల్లా పోలీస్ అధికారి, డీఎస్పీ రాజ్ కుమార్ శ్రేష్ఠ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డజనుకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భరత్‌పూర్‌లోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు ఆయన చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

మనకమాన ఆలయం నుంచి తనాహు జిల్లాలోని అన్‌బుఖైరేని వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గోర్ఖా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తులసి బహదూర్ శ్రేష్ఠ తెలిపారు. నిటారుగా ఉన్న రహదారిపై ఎలక్ట్రిక్ మైక్రోబస్సు అదుపు కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. నేపాల్‌లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 2024 ఆగస్టులో ఇదే ప్రాంతంలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 27 మంది భారత యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. 

Related posts

కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట… మరణశిక్ష ఆదేశంలో మార్పు

Ram Narayana

ఢిల్లీ లీక్కర్ కేసులో కీలక పరిణామం, అప్రూవర్‌గా మారిన రామచంద్రపిళ్లై!

Ram Narayana

ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం.. మహిళలతో ప్రత్యేక వింగ్: ఐరాస సంచలన నివేదిక!

Ram Narayana