జాతీయ వార్తలు

ఎయిరిండియా, ఇండిగో బాటలోనే ఆకాశ ఎయిర్… టికెట్లపై ఇంధన సర్ చార్జ్

Akasa Air Introduces Fuel Surcharge on Flight Tickets

విమాన ప్రయాణికులకు మరో భారం పడింది. ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో బాటలోనే తాజాగా ఆకాశ ఎయిర్ కూడా పయనించింది. విమాన ఇంధనం ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన  సర్ చార్జ్‌ను ప్రవేశపెడుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 15 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు గణనీయంగా పెరిగాయని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ఇంధనానిదే సింహభాగమని, ఈ పెరుగుదల తమపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే దూరాన్ని బట్టి ఒక్కో టికెట్‌పై రూ. 199 నుంచి రూ. 1,300 వరకు సర్ చార్జ్‌ను విధిస్తున్నట్లు పేర్కొంది.

అయితే, మార్చి 15 కంటే ముందు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ అదనపు భారం ఉండదని ఆకాశ ఎయిర్ స్పష్టం చేసింది. సర్ చార్జ్ విధించినప్పటికీ, తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు, సరసమైన ధరలు అందించడంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చింది. ఇంధన ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సర్ చార్జ్‌పై పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఇటీవలే ఇండిగో సంస్థ మార్చి 14 నుంచి టికెట్లపై రూ. 425 నుంచి రూ. 2,300 వరకు, ఎయిర్ ఇండియా మార్చి 12 నుంచి దేశీయ విమానాల్లో రూ. 399 చొప్పున ఇంధన సర్ చార్జ్‌ను వసూలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో నడవడంతో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది.

Related posts

విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్: బంగారం తెచ్చే రూల్స్ మార్చిన కేంద్రం…

Ram Narayana

విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3… ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు..!

Drukpadam

కాంగ్రెస్ నేత హిమానీ న‌ర్వాల్ హ‌త్య కేసు… పోలీసుల అదుపులోకి నిందితుడు స‌చిన్‌!

Ram Narayana