మీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…బీజేపీని ప్రశ్నించిన పీసీసీ చీఫ్
బీజేపీ ఇచ్చిన ఉద్యోగులు ఎన్ని ఊడగొట్టింది ఎన్ని అనే లెక్కలు ఉన్నాయి
బీఆర్ యస్ 10 పాలనలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు ..
70 ఖాళీలు భర్తీ చేయలేదు …కాంగ్రెస్ 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చింది
ప్రతిపక్షాల ఉచ్చులో గ్రూప్ వన్ అభ్యర్థులు పడవద్దని విజ్ఞప్తి
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తాము అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ గత పదేళ్లుగా ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చిందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఊడగొట్టిందో తమ వద్ద లెక్కలున్నాయని తెలిపారు.
”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోగొట్టారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలూ ఇవ్వలేదు. ఇంటర్ ఫలితాలను తప్పుల తడకగా ఇచ్చి విద్యార్థుల చావులకు ఆ పార్టీ కారణమైంది. కేవలం 10 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను.. జిరాక్స్ సెంటర్లలో బీఆర్ఎస్ అమ్మకానికి పెట్టింది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జీవో 29ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తెచ్చాం. ఇన్నాళ్లు నోరుమెదపని ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాయి. మరికొద్ది గంటల్లో గ్రూప్ 1 పరీక్ష జరగనుండగా.. అమాయక అభ్యర్థులను రెచ్చగొట్టి వారి జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షలు తరచూ వాయిదా పడటం అభ్యర్థులకు మంచిది కాదు. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదలైంది. నిరుద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరుతున్నాం. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దు. ఎవరిపైనా లాఠీఛార్జ్ చేయొద్దని పోలీసులకు విన్నవిస్తున్నా. గ్రూప్ 1 పరీక్షలు సజావుగా సాగేలా సహకరించాలని కోరుతున్నా” అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.