భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అటువంటి ఆయన అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్సింగ్కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు… రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: కిషన్ రెడ్డి

- మాజీ ప్రధానులకు నిబంధనల ప్రకారమే స్మారక స్థల కేటాయింపు ఉంటుందన్న కిషన్ రెడ్డి
- ఖర్గేకు, మన్మోహన్ కుటుంబ సభ్యులకు అమిత్ షా కూడా తెలిపారన్న కేంద్రమంత్రి
- కాంగ్రెస్ రాజవంశానికి చెందని ఆ పార్టీ ప్రధానులను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఇది మాజీ ప్రధానులందరికీ నిబంధనల ప్రకారమే జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది తమను నిరుత్సాహపరిచిందన్నారు.
మన్మోహన్ అంత్యక్రియల విషయంలో తన వైఖరితో బీజేపీ ప్రభుత్వం ఆయనను అవమానించిందని, అంత్యక్రియలను అధికారిక స్మశాన వాటికలో కాకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద జరిపిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
నిబంధనల ప్రకారం మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థల కేటాయింపు జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మన్మోహన్ కుటుంబ సభ్యులకు తెలియజేశారని, కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాజవంశానికి చెందని (నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందని) ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత ప్రణబ్ ముఖర్జీ వంటి వారిని ఆ పార్టీ నిరంతరం మోసం చేస్తూ… అవమానాలకు గురి చేసిందని ఆరోపించారు. ఈ విషయం చరిత్రే చెబుతోందన్నారు. మన్మోహన్ మరణానికి కాంగ్రెస్ సంతాపం తెలియజేసినప్పటికీ… ఆ పార్టీ ఆయనకు చేసిన అవమానాలను మనం విస్మరించకూడదన్నారు.