- ఈరోజు మంగళిగిరిలో మీడియాతో మాట్లాడిన జనసేనాని
- బన్నీ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్న పవన్
- అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సిందని వ్యాఖ్య
- ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేనన్న డిప్యూటీ సీఎం
ఈ నెల 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో జనసేనాని మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పవన్ పేర్కొన్నారు.
“బన్నీ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. చట్టం అందరికీ సమానమే. పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయనకు ఆ అరుపుల్లో సరిగా వినిపించకపోవచ్చు.
అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్తో కలిసి థియేటర్లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిన గొప్ప నాయకుడు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ ఆయన వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అవకాశం ఇచ్చారు” అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలి… ఆ తర్వాతే మంత్రి పదవి: పవన్ కల్యాణ్

- నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం
- ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఇచ్చేంత ప్రత్యేక పరిస్థితులు లేవన్న పవన్
- అందుకే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిపై దృష్టి సారిస్తామని వెల్లడి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే… ఎమ్మెల్సీ కాకముందే మంత్రి పదవి ఇస్తారని, ఇప్పుడలాంటి ప్రత్యేక పరిస్థితులేవీ లేవని తెలిపారు. కాబట్టి, ముందు నాగబాబును ఎమ్మెల్సీ చేయడంపై దృష్టి సారిస్తామని పవన్ వెల్లడించారు.
ఇక్కడ కులం, బంధుప్రీతి ముఖ్యం కాదని… పనిమంతుడా, కాదా అన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తమ మంత్రివర్గంలో ఉన్న కందుల దుర్గేశ్ కులం ఏంటో తనకు ఇప్పటివరకు తెలియదన్నారు. నాగబాబు కష్టించి ఎదిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.