- అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపిన అమెరికా
- రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి
- 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడి
అమెరికా ప్రభుత్వం భారత్ కు అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో తిప్పి పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ నేడు రాజ్యసభలో ప్రకటన చేశారు.
అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తేమీ కాదని అన్నారు. చాలా ఏళ్ల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలాంటి బహిష్కరణల సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారని వివరించారు.
అక్రమ వలసలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జై శంకర్ స్పష్టం చేశారు. ఒక్క భారత్ అనే కాకుండా… అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని వెల్లడించారు. తమ దేశస్థులు చట్టవిరుద్ధంగా విదేశాల్లో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
భారత అక్రమ వలసదారుల తరలింపుపై అమెరికా స్పందన

- 104 మందిని ఎయిర్ ఫోర్స్ విమానంలో భారత్ కు డిపోర్ట్ చేసిన అమెరికా
- దేశ భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అవసరమన్న అమెరికా
- అది తమ దేశ విధానమని స్పష్టీకరణ
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను ఆ దేశం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మన దేశానికి చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం సీ-17 నిన్న మధ్యాహ్నం అమృత్ సర్ కు చేరుకుంది. మరోవైపు వలసదారులకు క్రిమినల్స్ మాదిరి సంకెళ్లు వేసి తరలించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశం ఈరోజు పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపేసింది.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా స్పందించింది. ఢిల్లీలోని యూఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ… తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరమని చెప్పారు. అది తమ దేశ విధానమని అన్నారు. విమానంలో వలసదారుల ప్రయాణం గురించి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని చెప్పారు.
మరోవైపు, ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేస్తోందని అన్నారు. 2012లో ఈ సంఖ్య 530గా ఉందని… ఇప్పుడు 2 వేలకు పైగా ఉందని చెప్పారు.