- కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
- కొంత కాలంగా గుబాయ్ లో తల దాచుకుంటున్న షకీల్
- తల్లి అంత్యక్రియలకు రావడంతో విమానాశ్రయంలోనే అరెస్ట్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2023లో షకీల్ కుమారుడు రహేల్ వేగంగా కారు నడుపుతూ ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేశాడు. షకీల్ వెంటనే కొడుకును దుబాయ్ పంపించారు. కొడుకును కేసు నుండి తప్పించేందుకు, దుబాయ్ పారి పోయేందుకు ఆయన సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారి పోయారు. గత కొంత కాలంగా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు, తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రావడంతో విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది.