- ప్రతి పక్షాన్ని అణచి వేసే దూకుడు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపణ
- కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పూర్తిగా ఒంటరిగా, చిక్కుకుపోయినట్లు భావించామని వెల్లడి
- భారత్ జోడో యాత్ర ద్వారా పాఠాలు నేర్చుకున్నానన్న రాహుల్ గాంధీ
- కోపం, ద్వేషంపై ప్రత్యర్థులు గుత్తాధిపత్యం కలిగి వున్నారని వ్యాఖ్య
దేశంలో ప్రస్తుతం ప్రతి పక్షాన్ని మాట్లాడనివ్వకుండా, అణచి వేసే దూకుడు రాజకీయాలు కొనసాగుతున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం తమ పార్టీ పూర్తిగా ఒంటరిగా, రాజకీయంగా చిక్కుకు పోయినట్లు భావించామని ఆయన వెల్లడించారు. తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయని, మీడియా సహా ఏదీ తమకు అనుకూలంగా లేదని అన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే తమ పార్టీ చరిత్రను గుర్తుచేసుకుని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. తాను కశ్మీర్లో యాత్రను ముగించినట్లు గుర్తుచేశారు. ఈ పాదయాత్ర ద్వారా తాను ముఖ్యంగా రెండు విషయాలు నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు.”ప్రపంచవ్యాప్తంగా మా ప్రత్యర్థులు కోపం, భయం, ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. ఆ విషయంలో వారితో పోటీ పడటం మా వల్ల కాదు. కోపం, భయం, ద్వేషం విషయంలో వారు ప్రతిసారీ మమ్మల్ని అధిగమిస్తారు, ఓడిస్తారు” అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో తాము ఎక్కడ, ఎలా పని చేయాలనే అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. తమను తాము నిర్మించుకునే అవకాశం ఎక్కడ ఉందో ఆలోచించామని అన్నారు. తాను నిన్ననే ఇక్కడికి రావాల్సి ఉన్నా, కశ్మీర్కు వెళ్లడం వల్ల రాలేకపోయానని, అందుకు క్షమించాలని కోరారు.