మీరు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే, అది వెయిటింగ్ లీస్ట్ లోనే ఉండి ఒకవేళ కన్ఫామ్ కాకుంటే ఇకపై స్లీపర్లో కానీ, ఏసీ కంపార్ట్మెంట్లో కాని ప్రయాణించే వీలు లేదని రైల్వే శాఖ కుండబద్దలు కొట్టింది. ఇలా టికెట్ కన్ఫార్మ్ కాకుంటే.. వారంతా జనరల్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణించ వలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే మరి ముఖ్యంగా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం బర్త్ కన్ ఫార్మ్ కాకుంటే.. టికెట్ ఆటోమెటిక్గా క్యాన్సిల్ అవుతోందని వెల్లడించింది. కానీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ తీసుకున్న వారు మాత్రం.. సదరు టికెట్ క్యాన్సిల్ చేసుకోకుంటే మాత్రం జనరల్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణించాలని తెలిపింది.
మరోవైపు.. గతంలో టికెట్ రిజర్వేషన్ చేయించుకొంటే.. అది కన్ఫార్మ్ కాకున్నా.. స్లీపర్ టికెట్ అయితే స్లీపర్లో.. ఏసీ టికెట్ అయితే.. ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వీలుండేది. కానీ మే 1వ తేదీ నుంచి ఆ పరిస్థితి లేదని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అదీకాక.. ఇలా టికెట్ కన్ఫార్మ్ కాకున్నా.. సదరు కంపార్ట్మెంట్లలో ప్రయాణించడం వల్ల.. టికెట్ కన్ ఫార్మ్ అయిన ప్రయాణికులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లవెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఉంటుందనే ఓ చర్చ జరుగుతోంది.