తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ ఇరిగేషన్ మంత్రి టి.హరీశ్రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 లోపు తమ ముందు విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది, ఎందుకంటే ఈ ముగ్గురు నాయకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, పైర్స్ కుంగి పోవడం, లీకేజీలు వంటి సమస్యలపై కమిషన్ విచారణ దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైంది. దీని నిర్మాణంలో భారీగా నిధులు ఖర్చయ్యాయి. అయితే, మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో నిర్మాణ లోపాలు బయట పడ్డాయి. దాంతోపాటు.. ఇతర బ్యారేజీలలో కూడా సమస్యలు కనిపించాయి. ఇది ప్రభుత్వానికీ, ప్రజలకూ ఆందోళన కలిగించింది. ఈ కారణంగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రచారం చేసుకో లేదు. అంతకు ముందు.. ఈ ప్రాజెక్టును తమ ఘనతగా బీఆర్ఎస్ చెప్పుకునేది. అలాంటిది ఎన్నికల్లో దీని ఊసే ఎత్తకుండా సైలెంట్ అయ్యింది. కారణం.. అప్పటికే ప్రజల్లో మేడిగడ్డపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడటమే. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాజెక్టుల్లో సమస్యలపై సమగ్ర విచారణకు జస్టిస్ పీ.సీ. ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది.
previous post