ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం
-బస్తర్ జిల్లాలో ఘటన
-45 నిమిషాలపాటు ఎదురు కాల్పులు
-తప్పించుకున్న మరికొందరు మావోయిస్టు ముఖ్యనేతలు
చత్తీస్గడ్లోని బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమైనట్టు ఎస్పీ దీపక్ఝా తెలిపారు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొందరు మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది.దీంతో రంగంలోకి దిగిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాల తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య రాత్రి 8 .30 గంటల నుంచి 9 .15 గంటల వరకు దాదాపు 45 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పీఎల్జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తప్పించుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
చనిపోయిన జోగపై 3 లక్షల రివార్డ్ ఉంది. జోగా మావోయిస్టు ముఖ్యనేతలకు ఎస్కార్ట్ గా వస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని దగ్గరనుంచి ఒక A K 47 ,SLR మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . బస్తర్ ఐ జి సుందర్ రాజ్ మాట్లాడుతూ తమకు నమ్మకమైన సమాచారం మేరకే పక్కా ప్రణాళికతో బస్తర్ ఆటవి ప్రాంతంలో జల్లెడ పడుతున్నామని తెలిపారు.గత జూన్ నెలలో మావోయిస్టులకు చెందిన 7 గురు ఎన్కౌంటర్ లో హతమయ్యారని అన్నారు. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గతంలో మావోయిస్టుల దాడిలో పెద్ద ఎత్తున పోలీస్ మరణించడంతో ఇప్పుడు పోలీసులు రూటు మార్చారు. పక్కాగా మావోల కదలికలు ఉన్నాయని నిర్దారించుకున్న తరువాతనే తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు పూనుకుంటున్నారు. మావోలను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక శిక్షణ కలిగిన కమాండోలు ఛత్తీస్ ఘడ్ ఆటవీప్రాంతంలో అడవిని జల్లెడ పెట్టె పనిలో ఉన్నారు.అటు మావోలు ఇటు పోలీసుల మధ్య గిరిజన పల్లెలు గిలగిలలాడుతున్నాయి. పచ్చని చెట్ల మధ్య తుఫాకి చప్పుళ్లతో ఆటవి ప్రాంతం దద్దరిల్లుతుంది.