ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం ఉదయం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఈ దుర్ఘటనలో ఓ ఎస్సైతో పాటు మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయట నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామాగ్రిని స్టేషన్కు తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్సై, పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
పేలుడు తీవ్రతకు స్టేషన్ భవనం పాక్షికంగా దెబ్బతింది. లోపల ఉన్న ఫర్నిచర్ చెల్లాచెదురుగా పడిపోగా, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

