అంతర్జాతీయం

చర్చలు విఫలం… ఇరాన్ స్పీకర్ ఘలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..!

అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా-ఇరాన్ ఉన్నత స్థాయి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. చర్చలు విఫలమవడంపై ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చర్చల సమయంలో అమెరికా తమ నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఘలీబాఫ్ ఆరోపించారు. మరోవైపు, తమ షరతులను అంగీకరించడానికి ఇరాన్ నిరాకరించిందని, ఇది అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరించారు.

చర్చల అనంతరం ఆదివారం ఘలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులు చేశారు. ఇరాన్ ప్రతినిధి బృందం పూర్తి సద్భావనతో, నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో చర్చలకు హాజరైందని తెలిపారు. “చర్చలకు ముందు మేం పూర్తి చిత్తశుద్ధితో ఉన్నామని స్పష్టం చేశాం. కానీ గత రెండు యుద్ధాల అనుభవాల దృష్ట్యా వారి(అమెరికా)పై మాకు నమ్మకం లేదు. మా ప్రతినిధులు ఎన్నో మంచి ప్రతిపాదనలు చేసినా, ఈ దఫా చర్చల్లో ఇరాన్ ప్రతినిధి బృందం నమ్మకాన్ని గెలుచుకోవడంలో అవతలి పక్షం విఫలమైంది” అని ఆయన పేర్కొన్నారు. 

“మా వాదన, మా సూత్రాలు అమెరికాకు అర్థమయ్యాయి. ఇప్పుడు మా నమ్మకాన్ని పొందగలదో లేదో నిర్ణయించుకోవాల్సింది వారే” అని ఘలీబాఫ్ మరో పోస్టులో సవాల్ విసిరారు. దేశ ప్రజలు తమకు అండగా నిలిచారని, 21 గంటల పాటు చర్చల్లో పాల్గొన్న తన సహచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చర్చల వైఫల్యంపై స్పందించారు. “మేం 21 గంటల పాటు చర్చలు జరిపాం. ఇరాన్‌తో అనేక విషయాలపై మాట్లాడాం. ఇది శుభవార్తే అయినా, ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం దురదృష్టకరం” అని ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో తెలిపారు. “ఈ చర్చల్లో మా పరిమితులు ఏమిటో, ఏయే అంశాల్లో సర్దుకుపోగలమో, వేటిలో రాజీపడలేమో చాలా స్పష్టంగా చెప్పాం. కానీ మా షరతులను అంగీకరించడానికి వారు నిరాకరించారు. ఈ ఫలితం అమెరికా కన్నా ఇరాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుంది” అని వాన్స్ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ను అణ్వాయుధ సామర్థ్యం పొందకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని వాన్స్ పునరుద్ఘాటించారు. “అణ్వాయుధాలను తయారుచేయబోమని ఇరాన్ నుంచి మాకు స్పష్టమైన హామీ కావాలి. కేవలం ఇప్పుడో, రెండేళ్లకో కాదు.. దీర్ఘకాలికంగా ఈ హామీ ఉండాలి. అలాంటి నిబద్ధత వారిలో ఇంకా కనిపించలేదు. త్వరలోనే అది వస్తుందని ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు. వాషింగ్టన్ ఇప్పటికే తన తుది ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఉపసంహరణ, తనిఖీల వంటి అంశాలపై గతంలోనూ చర్చలు జరిగి మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజా వైఫల్యంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన మరింత ముదిరినట్లయింది.

Related posts

రష్యాలో కార్మికుల కొరత.. భారీగా భారతీయుల నియామకానికి రంగం సిద్ధం

Ram Narayana

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం… క్రికెట్ స్టేడియం కంటే పెద్దదంటున్న ఇస్రో చీఫ్

Ram Narayana

425 మంది ప్రయాణిస్తున్న విమానంలో మంటలు .. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర పరిస్థితి..!

Ram Narayana