తెలంగాణ వార్తలు

నా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు : వివాదాస్పద వ్యాఖ్యలపై కొండా మురళి

  • కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరైన కొండా మురళి
  • తన వ్యాఖ్యలపై ఛైర్మన్ మల్లు రవికి వివరణ అందజేత
  • కమిటీకి ఆరు పేజీల రాతపూర్వక సమాధానం సమర్పణ
  • కార్యకర్తలను పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని స్పష్టీకరణ
  • రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇటీవల కొందరు పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో కొండా మురళి శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో తన మద్దతుదారులు, కార్యకర్తలతో తరలివచ్చారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు హాజరై తన వాదనను వినిపించారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాలను వివరిస్తూ ఆరు పేజీల రాతపూర్వక లేఖను కమిటీకి సమర్పించారు.

విచారణ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ, ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవి గారికి పూర్తిగా వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కొందరు నేతలపై నేను చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో ప్రజలందరికీ తెలుసు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాను’’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘గత 40 ఏళ్లుగా బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని కొండా మురళి పేర్కొన్నారు. ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పందించారు. ‘‘మేము పంపిన నోటీసుకు స్పందించి కొండా మురళి విచారణకు వచ్చారు. ఆయన తన వాదనను మాకు వినిపించారు. రాతపూర్వకంగా కూడా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు’’ అని మల్లు రవి తెలిపారు. కొండా మురళి ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత పార్టీ అధిష్ఠానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts

కేటీఆర్, నాగార్జున, నాగచైతన్యపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

Ram Narayana

ఇది ప్రజాపాలనంటే..ప్రపంచంతో పోటీపడలనే లక్ష్యంతో ముందుకు..డిప్యూటీ సీఎం భట్టి !

Ram Narayana

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల బదిలీ.. కొత్త సీపీలు వీరే!

Ram Narayana