తెలంగాణ వార్తలు

పాశమైలారం ప్రమాదం …మృతులకు ఒక్కరికి కోటి నష్టపరిహారం ప్రకటించిన యాజమాన్యం..!

  • పాశమైలారం దుర్ఘటనపై ఎట్టకేలకు స్పందించిన సిగాచి యాజమాన్యం
  • మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటన
  • గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ బాధ్యత స్వీకరణ

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పెను విషాదాన్ని మిగిల్చిన సిగాచి పరిశ్రమ ప్రమాదంపై యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున భారీ పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారి పూర్తి వైద్య ఖర్చులతో పాటు వారి కుటుంబాల పోషణ బాధ్యతను కూడా తామే చూసుకుంటామని హామీ ఇచ్చింది.

ఈ మేరకు కంపెనీ సెక్రటరీ వివేక్, స్టాక్ మార్కెట్లకు ఓ లేఖ ద్వారా వివరాలను తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు, అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను కూడా చెల్లిస్తామని ఆ ప్రకటనలో హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, వారు కోలుకునే వరకు వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 40 మంది కార్మికులు మరణించారని, మరో 33 మంది గాయపడ్డారని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

పరిశ్రమలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణమన్న ప్రచారాన్ని కంపెనీ తోసిపుచ్చింది. ప్రమాద కారణాలపై ప్రభుత్వ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా పాశమైలారంలోని ప్లాంట్‌లో కార్యకలాపాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది.

పాశమైలారం పేలుడు ఘటన: ప్రభుత్వం కీలక నిర్ణయం

Pasamylaram Explosion Telangana Govt Forms High Level Committee
  • సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడుపై ప్రభుత్వ విచారణ
  • సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
  • ప్రమాద కారణాలు, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు ఆదేశాలు
  • నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
  • భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలపై సూచనలు కోరిన ప్రభుత్వం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది.

సీఎస్‌ఐఆర్‌‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బి. వెంకటేశ్వరరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా చీఫ్‌ సైంటిస్ట్‌ టి. ప్రతాప్‌కుమార్‌, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్‌ ఘుగేను నియమించారు. ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారాన్ని ఫ్యాక్టరీల డైరెక్టరేట్‌ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలను గుర్తించడం, సిగాచి పరిశ్రమ యాజమాన్యం భద్రతా నియమాలను, నిబంధనలను పాటించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం ఈ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. దీంతో పాటు భవిష్యత్తులో రసాయన పరిశ్రమల్లో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పటిష్ఠమైన చర్యలపై ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేయాలని కమిటీని కోరింది.

మరోవైపు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదం జరిగిన పరిశ్రమను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.

Related posts

సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్… దేశ సగటు కంటే 10 రెట్లు ఎక్కువ!

Ram Narayana

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు… బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు!

Ram Narayana

తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ వేసిన కేటీఆర్!

Ram Narayana