జాతీయ వార్తలు

మాజీ సీజేఐ బంగ్లా వివాదం.. ఖాళీ చేయించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ!

  • పదవీ విరమణ తర్వాత గడువు ముగిసినా నివాసం వీడని వైనం
  • ప్రత్యేక అవసరాలున్న కుమార్తెల వల్లే ఆలస్యమైందని చంద్రచూడ్ వివరణ
  • ప్రత్యామ్నాయ వసతి సిద్ధమవగానే మారిపోతానని స్పష్టీకరణ

భారత న్యాయవ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, పదవీ విరమణ తర్వాత కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. గడువు ముగిసినా ఆయన ఇంకా అక్కడే ఉంటున్నారని, ఆ బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్‌లో ఉన్న 5వ నంబర్ బంగ్లాను భారత ప్రధాన న్యాయమూర్తికి కేటాయిస్తారు. 2024 నవంబర్‌లో పదవీ విరమణ చేసిన జస్టిస్ చంద్రచూడ్, ఇప్పటికీ అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ తర్వాత ఆరు నెలల గడువు ఈ ఏడాది మే 10తోనే ముగిసింది. ప్రత్యేక అనుమతితో మే 31 వరకు పొడిగించినా ఆయన బంగ్లాను ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు యంత్రాంగం జులై 1న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. “జస్టిస్ చంద్రచూడ్ నుంచి బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోండి. ఆయనకు ఇచ్చిన అనుమతి గడువు ముగిసింది” అని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది.

ఈ వివాదంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. తప్పనిసరి వ్యక్తిగత కారణాల వల్లే ఆలస్యమైందని, ఈ విషయం సుప్రీంకోర్టు యంత్రాంగానికి కూడా తెలుసని ఆయన వివరించారు. “నాకు ప్రత్యేక అవసరాలున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి (నెమాలిన్ మయోపతి) కారణంగా వారికి అనువైన ఇల్లు చూసుకోవడానికి కొంత సమయం పట్టింది. ప్రభుత్వం నాకు ప్రత్యామ్నాయ వసతి కేటాయించింది. కానీ ఆ ఇల్లు చాలాకాలంగా మూసి ఉండటంతో మరమ్మతులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన మరుక్షణమే నేను మారిపోతాను” అని ఆయన తెలిపారు.

తాను అత్యున్నత పదవిలో పనిచేశానని, తన బాధ్యతలు తనకు పూర్తిగా తెలుసని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే, సుప్రీంకోర్టు పరిపాలన విభాగం స్వయంగా ఒక మాజీ సీజేఐ నివాసం ఖాళీ చేయించడం కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం మాత్రం ఇదే ప్రథమం కావడంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

మీడియా ప్రతినిధులపై కర్ణాటక సీఎం అసహనం!

Ram Narayana

కేజ్రీవాల్‌కు షాక్… బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత!

Ram Narayana

ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 7గురు నవజాత శిశువుల దుర్మరణం…

Ram Narayana