DK Shivakumar
రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు .. ప్రియాంక గాంధీతో డీకే శివకుమార్ కీలక భేటీ

  • ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో సమావేశమైన డీకే శివకుమార్
  • కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు
  • ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం మాట్లాడకుండా వెళ్లిన శివకుమార్
  • త్వరలో అధిష్టానంతో సిద్ధరామయ్య కూడా భేటీ అయ్యే అవకాశం

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో సమావేశం కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ ఈ భేటీతో తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య ఒప్పందం జరిగిందనే ప్రచారం బలంగా ఉంది. దీని ప్రకారం, తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మిగిలిన కాలానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే త్వరలో డీకే ముఖ్యమంత్రి అవుతారని ఆయన వర్గం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కావాలనే తన ఆశను శివకుమార్ కూడా దాచుకోవడం లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “పదవిని ఆశించడంలో తప్పేముంది?” అంటూ తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తాను ఐదేళ్ల పూర్తికాలం పదవిలో కొనసాగుతానని ధీమాగా చెబుతున్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రియాంక గాంధీతో డీకే శివకుమార్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

టీడీపీ అభ్యర్థి అనురాధను గెలిపించిన వారిని గుర్తించిన వైసీపీ!

Drukpadam

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు: బాలినేని

Drukpadam

షర్మిల పాలేరునే ఎందుకు ఎంచుకున్నారు …రాజకీయ సర్కిల్స్ లో ఆసక్తి!

Drukpadam