- వేడి పుట్టిస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
- బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందన్న అవినాశ్ రెడ్డి
- దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపాటు
- రాష్ట్ర ఎన్నికల సంఘంపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు!
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది. ఎన్నికలో గెలుపును ఇటు అధికార పక్షం, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్ రెడ్డి బరిలో ఉన్నారు.
మరోవైపు, రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కు ముందు బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల మార్పు వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపడ్డారు. ఏ ఊరి వాళ్లు ఆ ఊళ్లోనే ఓటు వేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి, ఈసీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
ఓటమి భయంతో పులివెందులలో టీడీపీ కుట్రలకు తెరలేపింది: రాచమల్లు శివప్రసాదరెడ్డి

- ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందన్న రాచమల్లు
- టీడీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని మండిపాటు
- సాక్షి సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నాారని ఆగ్రహం
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. అధికార అండతో అధికారులను టీడీపీ విచ్చలవిడిగా వాడుకుంటోందని మండిపడ్డారు.
పులివెందులలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసని రాచమల్లు అన్నారు. వైఎస్ అనే పేరుకు పులివెందులలో ఓటమే లేదని చెప్పారు. సాక్షి సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా సిబ్బంది అంతా వైసీపీ కుటుంబ సభ్యులేనని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఎద్దేవా చేశారు.
నాపై దాడి జరిగితే నారా లోకేశ్, బీటెక్ రవి బాధ్యత వహించాలి: పులివెందుల వైసీపీ నేత సతీశ్ రెడ్డి

- తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న సతీశ్ రెడ్డి
- దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
- పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని మండిపాటు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పులివెందుల నేత సతీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని… ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనతో చెప్పారని ఆయన తెలిపారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. తనపై దాడి జరిగితే దానికి మంత్రి నారా లోకేశ్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
తనపై దాడి జరిగితే కోర్టులు సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఇక్కడి పోలీసులతో తనకు న్యాయం జరగదని… తనపై దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. ఏపీ పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని చెప్పారు. టీడీపీ, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోతోందని అన్నారు.
టీడీపీ వాళ్లే దాడి చేసి, ఆ నెపాన్ని తమపై మోపడం రివాజుగా మారిందని సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల అరాచకాలు తట్టుకోలేక ఉప ఎన్నికను వదిలిపెడతామని అనుకుంటున్నారేమో… తమ పార్టీ మహిళలే ఎన్నికలను ముందుండి నడిపిస్తారని చెప్పారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను గెలిచి తన తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇవ్వాలని నారా లోకేశ్ అనుకుంటున్నారని సతీశ్ రెడ్డి అన్నారు. లోకేశ్ మీరు అనుచితంగా మాట్లాడితే… మేము కూడా అలానే మాట్లాడతామని చెప్పారు. ఈ ఉప ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేశ్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు అని అన్నారు.