ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శాసనమండలి నుంచి బొత్స సత్యనారాయణ వాకౌట్!

  • శాసనమండలిలో అనధికార విగ్రహాలపై తీవ్ర చర్చ
  • వైఎస్ విగ్రహాలపై టీడీపీ సభ్యుల ఆరోపణలు
  • నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష నేత బొత్స

అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల మధ్య విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందులలో ప్రజా నిధులతో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్ల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ సభ్యులు తిరుమలనాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అనధికార విగ్రహాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అయితే, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నాయకుడు వైఎస్ఆర్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, బయటకు వెళ్లిపోయారు.

ఈ చర్చ అనంతరం, సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రహదారులపై 1671, రాష్ట్ర హైవేలపై 815 విగ్రహాలు ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2013 ఫిబ్రవరి 18న జారీ చేసిన జీవో 18 ప్రకారం పబ్లిక్ రోడ్లు, కాలిబాటలపై విగ్రహాలకు అనుమతి లేదని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ నిబంధన హై మాస్ట్ లైట్లు, రోడ్ల సుందరీకరణ వంటి ప్రజా వినియోగ పనులకు వర్తించదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విగ్రహాలను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి సభకు తెలిపారు. 

Related posts

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు…

Ram Narayana

శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్…

Ram Narayana

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం!

Ram Narayana