
- కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా ,ఏపీ సీఎం చంద్రబాబు…
- పాట్నాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం
- నితీశ్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
- సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు
- మంత్రి మండలి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీశ్ కుమార్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా, జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుంచి 14 మందికి, జేడీయూ నుంచి 9 మందికి చోటు దక్కింది.
నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి సీఎంగా ఏడు రోజులు మాత్రమే పనిచేసిన ఆయన, ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు. “రాజకీయాల్లో ఎంతో అనుభవం, రాష్ట్రానికి మంచి పాలన అందించిన అద్భుతమైన రికార్డు నితీశ్కు ఉంది” అని ఆయన కొనియాడారు.
నితీశ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్

- మంత్రి మండలి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్
- కొత్త ప్రభుత్వం తన హామీలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ యాదవ్
- బీహార్ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ
బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు హృదయపూర్వక అభినందనలు. మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన బీహార్ ప్రభుత్వ మంత్రులందరికీ కూడా అభినందనలు” అని ఆయన పేర్కొన్నారు.
“కొత్త ప్రభుత్వం తమ హామీలను, ప్రకటనలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని, ప్రజల ఆశలు మరియు అంచనాలకు అనుగుణంగా పాలన చేస్తుందని ఆశిస్తున్నాను. బీహార్ ప్రజల జీవితాల్లో సానుకూల మరియు గుణాత్మక మార్పును ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశిస్తున్నాము” అని తేజస్వి యాదవ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.