కోర్ట్ తీర్పులు

వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!

  • 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో హైకోర్టు తీర్పు
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆ స్వేచ్ఛ వారికి ఉందన్న కోర్టు
  • యువకుడికి 21 ఏళ్లు నిండలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం

యువతీయువకుల సహజీవనం విషయంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ వయస్సు రాకున్నా సరే యువతీయువకులు మేజర్లయితే పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది. 

ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. యువకుడికి వివాహ వయస్సు రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందన్న యువకుడి ఆందోళన నేపథ్యంలో ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టును ఆశ్రయించిన యువ జంట
రాజస్థాన్ హైకోర్టులో 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరమూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. అయితే, యువతి కుటుంబం దీనిని వ్యతిరేకిస్తూ తమను చంపేస్తామని బెదిరిస్తోందని, తమకు రక్షణ కల్పించాలని యువకుడు కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది.

వివాహ వయస్సు రాకున్నా సరే..
ఈ జంటలో యువకుడికి వివాహ వయస్సు (21 ఏళ్లు) రాలేదని, సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయస్సు రాలేదనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛా హక్కును హరించలేమని పేర్కొంది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని.. దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.

Related posts

భార్యను 224 ముక్కలుగా నరికి నదిలో పారేశాడు.. రేపు శిక్ష ఖరారుచేయనున్న ఇంగ్లండ్ కోర్టు…

Ram Narayana

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష

Ram Narayana

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!

Ram Narayana