జాతీయ వార్తలు

పంజాబ్ సీఎం పదవికి రూ.500 కోట్లా? సిద్ధూ భార్య వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..

  • సిద్ధూ భార్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్న బీజేపీ, ఆప్
  • కాంగ్రెస్‌లో ‘మనీ బ్యాగ్’ రాజకీయాలు బట్టబయలయ్యాయని బీజేపీ విమర్శ
  • ఇది కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్య
  • తన భర్తను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాజకీయాల్లోకి వస్తారన్న కౌర్

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత వ్యవహారాలపై ఆ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. “రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వారే ముఖ్యమంత్రి అవుతారు” అంటూ ఆమె చేసిన ఆరోపణపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రంగా స్పందించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. “పంజాబ్ సీఎం పదవి ధర రూ.500 కోట్లని నవజోత్ కౌర్ బహిరంగంగా చెప్పడం ద్వారా కాంగ్రెస్‌లోని ‘మనీ బ్యాగ్’ రాజకీయాలను బట్టబయలు చేశారు. అంత డబ్బు తన భర్త చెల్లించలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. ఒక సీనియర్ నేత భార్యే ఈ మాట చెప్పడం కాంగ్రెస్‌లో నైతిక పతనాన్ని సూచిస్తోంది” అని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు పంజాబ్ రాజకీయాలను ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి డబ్బుతో నడిచే వేలం వ్యవస్థగా మార్చాయని ఆయన ఆరోపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి బల్తేజ్ పన్నూ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. “కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుందో, నాయకత్వాన్ని ఎలా నిర్ణయిస్తారో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రయోజనాలను ఎలా పక్కన పెడతారో నవజోత్ కౌర్ వ్యాఖ్యలు బయటపెట్టాయి. ఈ ఆందోళనకర వ్యాఖ్యలపై పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ నవజోత్ కౌర్, తన భర్త నవజోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తారని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ పంజాబ్ కోసమే నిలబడ్డామని, కానీ ఏ పార్టీకైనా రూ.500 కోట్లు ఇచ్చేంత స్థోమత తమకు లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts

వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్..

Ram Narayana

బెంగాల్ ఎన్నికలకు రికార్డు స్థాయిలో భద్రత.. ప్రతి దశలో 2,400 కంపెనీల బలగాలు

Ram Narayana

ట్రంప్ టారీఫ్ ల వెనక అసలు ఉద్దేశం వేరే అంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్…

Ram Narayana