- గ్రామాల్లోకి జొరబడి దాడులు చేస్తున్న చిరుతపులులు
- చిరుత దాడుల్లో వ్యక్తులు చనిపోతే పరిహారం చెల్లించే బదులు మేకలు వదలాలన్న మంత్రి
- రూ.1 కోటి విలువైన మేకలను అడవిలోకి వదలాలని సూచన
చిరుతపులులు ఆహారం కోసం మానవ నివాసాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అడవుల్లోకి పెద్ద సంఖ్యలో మేకలను వదలాలని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ సూచించారు. చిరుతపులులు గ్రామాల్లోకి జొరబడి దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో శాసనసభలో ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
చిరుత దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణిస్తే ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లిస్తోందని ఆయన అన్నారు. మరణించిన తర్వాత పరిహారం చెల్లించే బదులు చిరుతలు మానవ ఆవాసాలలోకి రాకుండా రూ.1 కోటి విలువైన మేకలను అడవిలోకి వదిలాలని ఆయన సూచించారు.
చిరుతపులి బెడద ఉన్న ప్రాంతాల్లో తాము త్వరలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని మంత్రి శాసనసభలో తెలిపారు. చిరుతపులుల ప్రవర్తన, జీవన విధానాలు మారిపోయాయని ఆయన అన్నారు. ఇంతకుముందు వాటిని అటవీ జంతువులుగా అభివర్ణించేవారని, కానీ ఇప్పుడు చెరుకు తోటలు కూడ వాటి ఆవాసాలుగా మారాయని అన్నారు. అహల్యా నగర్, పుణే, నాసిక్ జిల్లాల్లో చిరుత దాడులు ఇటీవల భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు.