పామాయిల్లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్ హిట్
రాష్ట్రంలో సరికొత్త సాగు విప్లవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా అడుగులు వేశారు. పామాయిల్ తోటల్లో సంప్రదాయ అంతర పంటలకే పరిమితం కాకుండా, లాభదాయకమైన పసుపు సాగు సాధ్యమేనని ఆయన నిరూపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలోని తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కొంత మేర చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పుడు రైతాంగంలో చర్చనీయాంశమైంది.సాధారణంగా ఈ ప్రాంత రైతులు 3 సంవత్సరాల లోపు పామాయిల్, వేరుశెనగ, మొక్కజొన్న లేదా అంతర పంటలుగా వేస్తుంటారు. అయితే, పసుపు సాగులో ఉన్న గిరాకీని గుర్తించిన మంత్రి, ఈ ప్రాంత వాతావరణం దీనికి సహకరిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి తన తోటలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు.
తాజాగా పసుపు దుంపలను మంత్రి స్వయంగా పరిశీలించారు. దుంపలు బాగా ఊరడంతో పాటు అత్యంత నాణ్యంగా ఉండటంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పామాయిల్ ఎలాగో ఉంటుంది, దానికి తోడు అంతర పంటగా పసుపు వేస్తే రైతులకు అదనంగా లక్షల్లో లాభం వచ్చే అవకాశం ఉందని ఈ ప్రయోగం స్పష్టం చేసింది. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా, రైతులకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా సాగు చేసి చూపడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు