- ఆర్బీఐ ఖజానా నుంచి రూ.1.28 లక్షల కోట్ల విలువైన బంగారం మాయమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి సంబంధించి బంగారం నిల్వల డేటాను విడుదల చేసిన ఆర్బీఐ
- బంగారం నిల్వల మొత్తం విలువ గణనీయంగా తగ్గినట్లు ఆ డేటాలో పేర్కొన్న ఆర్బీఐ
- ఆ అంశం ఆధారంగా ఓ హిందీ దినపత్రికలో రూ.1.28 లక్షల కోట్ల బంగారం మిస్సింగ్ అంటూ కథనం
- ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న పీఐబీ, ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖజానా నుంచి రూ.1.28 లక్షల కోట్ల విలువైన బంగారం మాయమైందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్తో పాటు ఆర్బీఐ కూడా ఖండించింది. ఈ తరహా తప్పుడు పోస్టులను నమ్మొద్దని ప్రజలకు సూచించాయి.
అసలు విషయం ఏమిటంటే..ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి సంబంధించి ఆర్బీఐ బంగారం నిల్వల డేటాను విడుదల చేసింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో.. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల మొత్తం విలువ గణనీయంగా తగ్గినట్లు ఆ డేటాలో పేర్కొంది. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకుని ఓ హిందీ దినపత్రిక ప్రచురించిన వార్తలో రూ.1.28 లక్షల కోట్ల బంగారం మిస్సింగ్ అయినట్లు భావించేలా కథనం రావడంతో గందరగోళం ఏర్పడింది. దానిని ఆధారంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఇది వైరల్గా మారింది.
దీనిపై స్పందించిన పీఐబీ, ఆర్బీఐ..ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపాయి. బంగారం విలువ మాత్రమే తగ్గిందని, భౌతికంగా బంగారం నిల్వల్లో ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశాయి. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్సైట్ను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించాయి.