- రాజస్థాన్ భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన
- అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారన్న జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సుమిత్రా పారీక్
- ఉప రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
రాజస్థాన్ భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఫ్యాక్టరీలోనే చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగగా.. కొద్ది సేపటికే భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి సహాయక చర్యలు చేపట్టారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు. కాగా ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఫ్యాక్టరీ వస్త్రాల కర్మాగారంగా చలామణి అవుతూ అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సుమిత్రా పారీక్ వెల్లడించారు.
ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.