- బర్డ్ ఫ్లూ తదితర కారణాలతో నిషేధం విధించిన సౌదీ
- అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై పాక్షిక నిషేధం
- అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షిస్తూ జాబితాను సవరిస్తామని వెల్లడి
ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 దేశాల నుండి కోళ్లు (పౌల్ట్రీ), గుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సంపూర్ణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయంగా వ్యాపిస్తున్న వివిధ రకాల అంటువ్యాధులు, ముఖ్యంగా ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ తదితర వైరస్ ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ తాజా జాబితాలో భారత్తో పాటు చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ దేశాల జాబితాను సవరిస్తామని అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ నిషేధం కేవలం పచ్చి మాంసం, గుడ్లకు మాత్రమే వర్తిస్తుందని సౌదీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన (Heat-treated) పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేని విధంగా ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు, ధృవీకరించబడిన సంస్థల నుండి వస్తే అనుమతిస్తామని పేర్కొన్నారు.