అంతర్జాతీయం

లండన్ లో తెలుగు యవకుడి మృతి

  • అగ్నిప్రమాదంలో మృతి చెందిన గొంతి అభిషేక్
  • ఎంబీఏ చదివేందుకు వెళ్లి, ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డ అభిషేక్
  • అభిషేక్ మృతితో గ్రామంలో విషాదం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, ప్రయోజకుడవుతాడనుకున్న ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. లండన్‌లో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్ (28) మృతి చెందాడు. ఈ వార్తతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అభిషేక్ తండ్రి ఆస్కారరావు ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓ (CHO)గా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిని ఉన్నత విద్యావంతుడిగా చూడాలన్న ఆకాంక్షతో మూడేళ్ల క్రితం ఆయన అభిషేక్‌ను ఎంబీఏ చదివేందుకు లండన్ పంపారు. చదువు పూర్తయిన తర్వాత అభిషేక్ అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. కేవలం ఆరు నెలల క్రితమే ఆయన స్వస్థలానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్లాడు. అంతలోనే ఈ ఘోరం జరగడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

అగ్నిప్రమాదం వివరాల్లోకి వెళితే… అభిషేక్ నివసిస్తున్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో లోపలే చిక్కుకుపోయిన ఆయన, మంటల తీవ్రతకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు, అభిషేక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Related posts

భారతీయ పాటల ప్రసారాన్ని ఆపివేసిన పాకిస్థాన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లు!

Ram Narayana

బంగ్లాదేశ్ ఎన్నికలు… ఢాకాలో ఓటు హక్కును వినియోగించుకున్న ముహమ్మద్ యూనస్..

Ram Narayana

శాంతి లభిస్తుందంటే పదవిని వదిలేస్తా: జెలెన్ స్కీ!

Ram Narayana