జాతీయ వార్తలు

సుఖోయ్ మిస్సింగ్ కథ విషాదాంతం…

  • అసోంలో కూలిన యుద్ధ విమానం
  • వాయుసేన పైలట్లు ఇద్దరూ దుర్మరణం
  • పైలట్ల కుటుంబాలకు ఐఏఎఫ్ సంతాపం

సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. పైలట్ల శిక్షణలో భాగంగా నిన్న సాయంత్రం గాల్లోకి లేచిన సుఖోయ్ ఫైటర్ జెట్ కాసేపటికే కూలిపోయిందని వాయుసేన అధికారులు ధ్రువీకరించారు. అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ (Su-30 MKI) యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ గా గుర్తించినట్లు పేర్కొంది.

అసలేం జరిగిందంటే..
జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి పైలట్ల శిక్షణలో భాగంగా గురువారం సాయంత్రం టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం కొద్దిసేపటికే రాడార్ సంబంధాలను కోల్పోయింది. దీంతో విమానం జాడ కనిపెట్టేందుకు వాయుసేన గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు జోర్హాట్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మరణించిన పైలట్ల కుటుంబాలకు వాయుసేన సంతాపం తెలిపింది. ‘‘పైలట్ల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో వాయుసేన ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది’’ అని ఐఏఎఫ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రమాదంపై వాయుసేన ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపింది. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది దర్యాప్తులో తేలనుంది.

Related posts

భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తిరుగుబాటుదారుల మృతి

Ram Narayana

నిషేధాన్ని ధిక్కరించి బాణసంచా కాల్చిన ఢిల్లీ వాసులు..

Ram Narayana

షక్సాగామ్ లోయ తమదేనన్న చైనా… ఆ ఒప్పందం చెల్లదన్న భారత్

Ram Narayana