జాతీయ వార్తలు

వంట గ్యాస్‌పై వాత.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 60 పెంపు…

  • కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 115 పెంచిన ఆయిల్ కంపెనీలు
  • అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలే కారణం
  • ఉజ్వల పథకం లబ్ధిదారులకు పెంపు నుంచి మినహాయింపు

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ (డొమెస్టిక్), వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ఈ ధరలు శనివారం (మార్చి 7, 2026) నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.

తాజా పెంపుతో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 60 పెరిగింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 853 నుంచి రూ. 913కి చేరింది. సుమారు 11 నెలలుగా స్థిరంగా ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు పెరగడం గమనార్హం. అయితే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. వారికి పాత ధరలే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 115 మేర పెంచారు. ఫలితంగా ఢిల్లీలో దీని ధర రూ. 1,883కి చేరింది. ఈ పెంపు ప్రభావంతో బయట ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ ప్రభావమే దేశీయ గ్యాస్ ధరల పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.

Related posts

ఈడీ విచారణకు టీనా అంబానీ గైర్హాజరు…

Ram Narayana

తమిళ భాష పత్తాలేకుండా పోతుంది: సీఎం స్టాలిన్ ఆందోళన!

Ram Narayana

ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం..

Ram Narayana