అంతర్జాతీయం

భారతీయులు చాలా మంచి వాళ్లు… మేం చెప్పినట్టే చేశారు: ట్రంప్ సన్నిహితుడు స్కాట్ బెసెంట్

  • సముద్రంలో ఉన్న రష్యా ఆయిల్ కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి
  • ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత తీర్చేందుకు నిర్ణయం
  • భారతీయులు మంచివాళ్లంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ ప్రశంసలు
  • వచ్చే నెల 4వ తేదీ వరకు రష్యా ఆయిల్ దిగుమతికి తాత్కాలిక వెసులుబాటు
  • ఇంధన ధరల నియంత్రణ కోసమే ఈ నిర్ణయమని వెల్లడించిన అమెరికా

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా చూసేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు ‘ప్రత్యేక అనుమతి’ ఇచ్చింది. ఇప్పటికే ట్యాంకర్ నౌకలలో రవాణాకు సిద్ధంగా ఉన్న రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ భారత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయాన్ని ట్రంప్ సన్నిహితుడు, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “భారతీయులు చాలా మంచివాళ్లు. రష్యా ఆయిల్ కొనవద్దు అని చెప్పాం… వారు (భారతీయులు) మేం చెప్పినట్టే ఆపేశారు. ఆ లోటును అమెరికా ఆయిల్ తో భర్తీ చేయాలని ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన చమురు సరఫరా గ్యాప్‌ను తగ్గించడానికి, సముద్రంలో సిద్ధంగా ఉన్న రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసేందుకు వారికి (భారత్ కు) అనుమతి ఇచ్చాం” అని తెలిపారు. ఈ వెసులుబాటు ఏప్రిల్ 4 వరకు అంటే 30 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సౌత్ ఏషియా సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్‌ను భారత్ త్వరగా రిఫైన్ చేసి మార్కెట్‌లోకి తెస్తే, ప్రపంచంలోని ఇతర రిఫైనరీల మీద ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది రష్యాపై అమెరికా విధానంలో శాశ్వత మార్పు కాదని, కేవలం యుద్ధం వల్ల ఏర్పడిన తాత్కాలిక అవసరాల కోసమేనని అధికారులు స్పష్టం చేశారు. గత నెలలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ రష్యా ఆయిల్ ఆపేసి అమెరికా ఆయిల్ కొనడానికి అంగీకరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ స్వల్పకాలిక మినహాయింపు ఇచ్చారు.

భారత్ లో రాజకీయ దుమారం

కేవలం ఒక్క పదం ఇప్పుడు భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు ‘పర్మిషన్’ (అనుమతి) ఇచ్చామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇది దేశానికి అవమానకరమని, ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన బలహీనతకు నిదర్శనమని విమర్శించింది. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ తన ఇంధన అవసరాల కోసం మరో దేశం ఆమోదం కోసం ఎదురుచూడాలా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. చమురు కొనుగోలు చేసేదుకు మనకు అమెరికా అనుమతి ఇవ్వడం ఏంటి? భారత సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారా? అని కాంగ్రెస్ నాయకత్వం మండిపడింది. అమెరికా ఇంతలా మాట్లాడుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని వారు నిలదీశారు.

అయితే, దీనిపై అమెరికా వివరణ మరోలా ఉంది. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద అవాంతరాల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఆయిల్‌ను కొనుగోలు చేయడానికి ఇచ్చిన మినహాయింపు స్వల్పకాలిక చర్య మాత్రమేనని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. కారణాలు ఏవైనప్పటికీ, అమెరికా వాడిన భాష ఇప్పుడు భారత్ సార్వభౌమాధికారం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానంపై కొత్త చర్చకు తెరలేపింది.

Related posts

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా!

Ram Narayana

అమెరికాలో దారుణం.. షికాగోలో ఏడుగురిని కాల్చిచంపి పరారైన దుండగుడు

Ram Narayana

కెనడాలో కొన్ని వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్

Ram Narayana