- బీఆర్ఎస్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదన్న రాంచందర్రావు
- రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు ధారాదత్తం చేస్తున్నాయని ఆరోపణ
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో దేశంలో చమురు కొరత రాదని భరోసా
- మోదీ ప్రభుత్వం 47 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని వెల్లడి
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దె దించడానికి ఈ రెండు పార్టీలు కలుస్తాయంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. రెండు పార్టీలూ తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు అప్పగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చూపి దేశంలో చమురు కొరత వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ భయాందోళనలు సృష్టిస్తోందని రామచందర్ రావు మండిపడ్డారు. దేశంలో చమురు కొరత వచ్చే అవకాశమే లేదని ఆయన భరోసా ఇచ్చారు. 2014కు ముందు భారత్ కేవలం 16 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేదని, కానీ ప్రధాని మోదీ ముందుచూపుతో ప్రస్తుతం 47 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఈ వ్యూహాత్మక ప్రణాళిక వల్లే దేశంలో ఇంధన భద్రత బలంగా ఉందని తెలిపారు. 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ఇరాన్కు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్లే ఆ దేశం మనకు చమురు సరఫరా నిలిపివేసిందని ఆయన గుర్తుచేశారు.