ఇంటి పన్ను భారాలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం – నున్నా నాగేశ్వరరావు
CPM ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్ ముందు భారీ ధర్నా…

ఖమ్మం నగర ప్రజలపై వేస్తున్న ఇంటి పన్ను ఆర్థిక భారాలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని CPM పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. CPM పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ముందు మంగళవారం భారీ ధర్నా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అనంత్ ప్రయివేటు లిమిటెడ్ అనే సంస్థకు ఆస్తి పన్నులు వేసే అధికారం కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటో ఖమ్మం నగర ప్రజలకు కమిషనర్, మేయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో వేస్తున్న ఆస్తి పన్నులపై అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని వెంటనే గత పాలసీ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇంటి పన్నులపై పాత GO ఉత్తర్వులను పక్కన బెట్టి మరీ క్రమబద్ధీకరణ పేరుతో ఎడాపెడా నగర ప్రజలపై ఇంటి పన్నులు వేసి వసూలు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రస్తుతం వస్తున్న ఇంటి టాక్స్ బిల్లులు చూసి
సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నులు వేసే విధానాన్ని పలు సర్కిల్ గా విభజన చేసి మరీ టాక్స్ లు వేయడం అనాలోచిత నిర్ణయం అని దుయ్యబట్టారు. పన్నులపై వడ్డీ పేరుతో మరింతగా అపరాధ రుసుం వేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
పైగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ నుంచి మరింత ఇంటి పన్నులు పెరుగుతాయి అని మీడియా వస్తున్న వార్తలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఆమోదం తెలిపి క్రమక్రమంగా ప్రజలపై వివిధ రూపాల్లో ఆర్థిక భారాలు వేసే పనిలో పడింది అని ఆరోపించారు. చెత్త పన్ను, నీళ్ళు పన్ను, ఇంటి పన్ను ఇలా భారాలు వేయడం ప్రయివేటీకరణ లో భాగమే అని విమర్శించారు. తక్షణమే ఖమ్మం కార్పొరేషన్ అధికారులు, కమీషన్, మేయర్, మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకొని నగర ప్రజలకు ఇంటి పన్నుల భారాలు నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ఈ సమస్యపై ప్రభుత్యం స్పందించకపోతే నగర ప్రజలను సమీకరించి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసురావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ధర్నా వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. వారు మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్య పరిష్కారం కోసం తమ ప్రయత్నం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, టి విష్ణు, MA జబ్బర్, భుక్యా శ్రీనువాసురావు, SK మీరా సాహిబ్, ఎస్ నవీన్ రెడ్డి, పి రమ్య , SK నాగులు మీరా , బోడపట్ల సుదర్శన్, ఉపేంద్ర, వజేనేపల్లి శ్రీనువాసురావు, పి నాగసులోచన, కార్పొరేటర్లు యర్రా గోపి, ఎల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు