పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు రూ కోటి ,ఇంటి స్థలం :సీఎం కేసీఆర్
పద్మశ్రీ కనక రాజు కు రివార్డు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెం లో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
పద్మశ్రీ అవార్డు ను అందుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిసారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను పొందడం పట్ల సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మెతుకు ఆనంద్,గణేశ్ బిగాల తదితరులున్నారు.
పద్మశ్రీ కనక రాజు కు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్ :
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కును సీఎం కేసీఆర్ ఆదేశించారు.