యాసంగి ధాన్యం పండించిన రైతులకు కేసీఆర్ భరోసా …
తెలంగాణ రైతులను ఎట్టి పరిస్థిలో నష్టపోనియ్యం …ధాన్యం మేమె కొంటాం
యాసంగి ధాన్యం ఎం ఆర్ పి రూ1960 లు ఇస్తాం
రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు
డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లో జమ అవుతాయి
కేంద్రమంత్రి వెకిలిగా మాట్లాడాలి రైతులను అవమానించారు
కేంద్రంపై యుద్ధం …యుద్ధమే
రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగి ధాన్యం పండించిన రైతులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు… తెలంగాణ రైతాంగాన్ని ఎట్టి పరిస్థిలో నష్టపోనియ్యమని , మొత్తం యాసంగి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు . ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశమైన సంగతి తెలిసిందే. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.
క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. గత కొద్దీ రోజులుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ధాన్యం కొనుగోలు అంశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టారు. ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. ధాన్యం కొనుగోలు నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణలో క్యా చమత్కార్ హై రావ్ సాబ్ అంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తనతో అన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. యాసంగిలోనే తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగైందని, దేశంలో ఎక్కడా లేని స్థాయిలో తెలంగాణలో వరి సాగైందని తెలిపారు. ఇదే తెలంగాణ చమత్కార్ అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం తమతో చేతకాదని కేంద్రం చెప్పేస్తే సరిపోతుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి సారీ ఓ మెలిక పెట్టి, కేంద్ర ఆహారభద్రత చట్టం కింద ఉన్న బాధ్యతను కేంద్రం విస్మరించి, నాటకాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా వేల టన్నుల బాయిల్డ్ రైస్ ఎగుమతి చేశారని, అయినా అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఇటు ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకుందని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలో నాలుగో అతిపెద్దదిగా నిలిచిందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచిందన్నారు. ఢిల్లీకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెద్దదని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5000 ఎకరాల్లో ఉంటే, మన హైదరాబాద్ ఎయిర్పోర్టు 5,200 ఎకరాల్లో విస్తరించి ఉందని వివరించారు. శంషాబాద్లో రెండో రన్వే ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జీఎంఆర్కు చెప్పామన్నారు. టెర్మినల్కు ఉత్తరాన ఇంకో రన్వే వస్తుందని తెలిపారు. త్వరలో రెండో రన్వే పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో జీఓ 111 ఎత్తివేస్తూ కాబినెట్ నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మే 20 నుండి జూన్ 5 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవాలనీ నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. వీటన్నిటికీ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ అధ్వర్యంలో కామన్ బోర్డ్ ఏర్పాటుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.